నందిగామ : వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండలం మేకగూడలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన చిగుర్లపల్లి మానస (32) అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం అదే గ్రామంలోని సబ్ సెంటర్లో కొవిడ్ టీకా కోవ్యాక్సిన్ రెండో డోసు తీసుకుంది. అనంతరం ఇంటికి వెళ్లిన మానస కొద్దిసేపటికే వంతులు చేసుకుంటూ స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే మానస మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలికి భర్త మాధవరెడ్డి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మానస మృతితో మేకగూడలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే మానస మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తు లు ఆరోపిస్తున్నారు.
విచారణ జరుపుతున్నాం..
మానస గత నెల 18వ తేదీన కోవ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని మంగళవార రెండో డోసు తీసుకున్న తర్వాత మృతి చెందినట్లు గ్రామస్తుల తెలిపారు. మానసకు ఇచ్చిన కోవ్యాక్సిన్ బాటిల్ల్లో తోమ్మిది మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వారంత ఆరోగ్యంగానే ఉన్నారని, మానస ఏ విధంగా చనిపోయరో విచారణ చేస్తున్నామని జిల్లా వైద్య ఉప అధికారి దామోదర్ తెలిపారు.