సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ మన సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. పార్వతి అనే 37 ఏళ్ల మహిళకు తలనొప్పిగా ఉంటోంది. రెండు నెలలుగా తనకు తలనొప్పి అంటూ ఆమె చెప్తోంది.
ఆస్పత్రికి వెళ్తే వైద్యులు అన్ని రకాల పరీక్షలూ చేశారు. కానీ ఆమెకు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలియలేదు. ఈ సమయంలోనే ఒక బంధువు ద్వారా బెక్క గ్రామంలో ఉన్న మను (42) అనే బాబా గురించి వారికి తెలిసింది. తలనొప్పి కచ్చితంగా తగ్గిస్తాడని బంధువులు చెప్పడంతో పార్వతిని బాబా దగ్గరకు తీసుకెళ్లారు.
ఆమె పరిస్థితి విన్న బాబా.. తలనొప్పి తగ్గిస్తానంటూ ఒక కర్రతో పార్వతి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిపాలైంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని పార్వతి కుమార్తె చైత్ర వెల్లడించింది. తల్లిని చంపాడంటూ మనుపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం మను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలియజేశారు.