తల్లిదండ్రులు ఎవరైనా తమ బిడ్డను తెల్లారగానే నిద్ర లేపడానికి ప్రయత్నిస్తారు. ఉదయాన్నే లేచి దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని చెప్తారు. అలా చెప్పడమే ఒక పెద్దాయన ప్రాణం తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని శివపురిలో వెలుగు చూసింది. ఇక్కడ ఉపేంద్ర శర్మ అనే యువకుడు ఒక ఏజెన్సీలో సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. అతను తండ్రి రామేశ్వర్ దయాల్ శర్మ (65)తో కలిసి ఉంటున్నాడు.
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి పూజ చేయడం రామేశ్వర్కు అలవాటు. బిడ్డ కూడా అదే పని చేస్తే మంచి జరుగుతుందని ఆయన నమ్మకం. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చి కొడుకును నిద్రలేపేవాడు. ఇలాగే మంగళవారం నాడు కూడా తండ్రి నిద్రలేపడంతో ఉపేంద్రకు కోపం వచ్చేసింది. దగ్గరలో ఉన్న కత్తి తీసుకొని తండ్రి గొంతు కోశాడు.
అక్కడితో ఆగకుండా తండ్రిని పలుమార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానిని చేరుకొని రామేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఉపేంద్రను అదుపులోకి తీసుకొని విచారించారు. నిద్రపోతుంటే తండ్రి వచ్చి లేపాడని, ఆ కోపంలోనే చంపేశానని ఉపేంద్ర తన నేరం అంగీకరించినట్లు సమాచారం.