ఒక ప్రముఖ రెస్టారెంట్లో మహిళల టాయిలెట్లో మొబైల్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డు చేసిన ఘటన వెలుగు చూసింది. ఇది చెన్నైలోని ఒక ప్రఖ్యాత ఫుడ్ చైన్ రెస్టారెంట్లో జరిగింది. ఇక్కడి గిండీ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్లో ఈ తతంగం చాలా రోజులుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల డీఎంకే పార్టీకి చెందిన ఒక మహిళా కార్యకర్త అడయార్లో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చింది. ఇక్కడ అర్బన్ బాడీ ఎన్నికల గురించి చర్చలు జరిగాయి. వీటి మధ్యలో లంచ్ చేయడం కోసం ఫుడ్ చైన్కు వెళ్లిన ఆమె వాష్రూమ్ వెళ్లింది. అక్కడ వెంటిలేటర్ దగ్గర ఒక బాక్సు ఉండటం ఆమె కంటపడింది.
ఏంటా? అని తెరిచి చూడగా బాక్సులో ఒక మొబైల్ ఫోన్ ఉండటం, దానిలో వీడియో రికార్డవుతూ ఉండటం చూసిన ఆమె షాకైంది. వెంటనే ఆ మొబైల్ తీసుకెళ్లి రెస్టారెంట్ నిర్వాహకులకు విషయం చెప్పింది. అలాగే గిండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు రెస్టారెంట్లో విచారణ జరిపారు. ఈ క్రమంలోనే తవకన్నన్ అనే వ్యక్తి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడని, అతనే ఈ మొబైల్ను వాష్రూమ్లో ఉంచాడని తేలింది. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.