న్యాల్కల్ : కర్ణాటక నుంచి ఉత్తర ప్రదేశ్కు 14 లక్షల రూపాయల విలువ గల నిషేధిత పొగాకు లోడుతో వెళ్తున్న యూపీ78 డి ఎన్ 8019 నెంబర్ గల లారీని హద్నూర్ పోలీసులు ఆదివారం సాయంత్రం పట్టుకున్నారు. స్థానిక ఎస్ఐ వినయ్ కుమార్ కథనం ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ పట్టణం నుంచి నిషేధిత పొగాకు లోడుతో ఒక లారీ వెళ్తోంది.
గణేష్ పూర్ గ్రామ శివారులో తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వాహనాల తనిఖీ జరుగుతోంది. ఈ క్రమంలో సదరు లారీని అధికారులు పట్టుకున్నారు. లారీలో ఉన్న బ్యాగులను పరిశీలించడంతో ఎస్ ఆర్- 1 నిషేధిత పొగాకు బస్తాలు లభించాయి. దీంతో లారీని హత్నూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
లారీలో ఉన్న 22 నిషేధిత పొగాకు బస్తాలతోపాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఈశ్వర్, పోలీసులు సంగమేశ్వర్, ఏక్నాథ్, కృష్ణ, రాజు, సేవాలాల్ తదితరులు పాల్గొన్నారు.