ప్రతిరోజూ కూరగాయలు తీసుకొచ్చే కుర్రాడు.. ఆ రోజు కూడా ఇంటికొచ్చాడు. దీంతో తలుపులు తీసిందా 79 సంవత్సరాల వృద్ధురాలు. అలా తీయడమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. తలుపులు తెరిచిన వృద్ధురాలిపై సదరు మైనర్ కుర్రాడు దాడి చేశాడు. రాయితో ఆమె తల బద్దలుకొట్టాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది.
కుసుమ్ సింఘాల్ (79) అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం కన్నుమూశాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఒక మైనర్ కుర్రాడు ప్రతిరోజూ కూరగాయలు డెలివరీ ఇచ్చేవాడు. అయితే శనివారం కూడా కూరగాయలు తీసుకొచ్చిన కుర్రాడు వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. రాయితో కొట్టి ఆమెను చంపేశాడు.
అనంతరం ఇంట్లోని విలువైన వస్తువులు, డబ్బు కాజేశాడు. కుమార్తె ఎన్నిసార్లు ఫోన్ చేసినా వృద్ధురాలు సమాధానం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన వృద్ధురాలి కుమార్తె.. తల్లి పొరుగింట్లో ఉండే వాళ్లకు ఫోన్ చేసి ఆరా తీసింది. అప్పుడే జరిగిన ఘోరం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుఉన్న పోలీసులు.. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.