ఆగ్రా: మద్యం తాగి, ఏ పనీ చేయకుండా డబ్బుల కోసం గొడవ పడుతున్న కుమారుడిపై ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. తన సోదరుడితో ఈ విషయం చెప్పాడు. వాళ్లిద్దరూ కలిసి ఒక కిరాయి హంతకుడిని కలిశారు. ఐదు వేల రూపాయలు ఇచ్చి తాగుబోతు అయిన కుమారుడిని చంపించేశారు.
ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో వెలుగు చూసింది. పచ్పోక్రా గ్రామానికి చెందిన మహరాజ్ సింగ్ అలియాస్ భోలా (30) ఓ పెద్ద తాగుబోతు. ఏ పనీ చేయకుండా మద్యం తాగుతూ తిరుగుతుంటాడు. మద్యం డబ్బుల కోసం తండ్రి పోఖ్పాల్ సింగ్పై ఆధారపడుతుంటాడు.
తండ్రి పేరిట ఉన్న ఆస్తిలో కొంత భాగం అమ్మేసి తనకు ఇవ్వాలని గొడవలు పడుతున్నాడు. చాలా రోజులుగా ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సోదరుడు గణేష్,పొరుగింట్లో ఉండే ఇంద్రపాల్ దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నాడు పోఖ్పాల్ సింగ్. వీళ్లిద్దరూ ఇచ్చిన సలహాతో వీరేందర్ అనే కిరాయి హంతకుడిని కలిసి భోలాను హత్య చేయించాలని పథకం వేశాడు.
దీనికోసం రూ.5 వేలు చెల్లించారు. ఈ డబ్బు తీసుకున్న వీరేందర్.. భోలాను హత్య చేసి ఊరి చివర పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి పోఖ్పాల్ సింగ్, గణేష్, పొరుగింట్లో ఉండే ఇంద్రపాల్, కిరాయి హంతకుడైన వీరేందర్ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వీరేందర్ తనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతుడి ఆధార్ కార్డు కూడా వీరేందర్ వద్ద లభించినట్లు పోలీసులు తెలిపారు.