Crime News | కిడ్నీలో రాళ్లకు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్ కిడ్నీ తొలగించాడో డాక్టర్. ఈ ఘటన గుజరాత్లో రాజధాని అహ్మదాబాద్లోని కేఎంజీ సెంట్రల్ హాస్పిటల్లో వెలుగు చూసింది. దేవేంద్ర భాయ్ రావల్ అనే వ్యక్తి వీపునొప్పి, మూత్ర విసర్జన సమస్యతో కేఎంజీ ఆసుపత్రిలో డాక్టర్ శివుభాయ్ పటేల్ను కలిశాడు.
పరీక్షలు చేసిన అనంతరం దేవేంద్ర ఎడమ కిడ్నీలో 14 మిల్లీమీటర్ల రాయి ఉన్నట్లు 2011 మే నెలలో గుర్తించారు. వేరే మంచి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవాలని డాక్టర్ శివుభాయ్ సూచించారు. అయితే దేవేంద్ర అదే ఆసుపత్రిలో చికిత్సకు చేరాడు. అదే ఏడాది సెప్టెంబరు 3న అతనికి శస్త్రచికిత్స చేశారు.
ఆ సమయంలో కిడ్నీలో రాళ్లు తొలగించడం కన్నా కిడ్నీ తొలగిస్తేనే మంచిందని దేవేంద్ర కుటుంబానికి డాక్టర్ చెప్పాడు. ఆ తర్వాత దేవేంద్ర కిడ్నీ తొలగించారు. అయితే శస్త్రచికిత్స తర్వాత దేవేంద్ర ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో అతన్ని ఐకేడీఆర్సీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2012 జనవరి 8న దేవేంద్ర కన్నుమూశాడు.
ఈ కేసును టేకప్ చేసిన గుజరాత్ రాష్ట్ర కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెస్ కమిషన్ ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి రూ.11.23 లక్షల నష్టపరిహారంతోపాటు 2012 నుంచి ఇప్పటి వరకూ ఆ మొత్తంపై 7.5 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. దేవేంద్ర కిడ్నీ తొలగించడానికి, అతని మరణానికి వైద్యుల, ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని ఈ కమిషన్ అభిప్రాయపడింది.