శంకర్పల్లి : మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య హత్య కేసులో నిందితులను శంకర్పల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. శంకర్పల్లి మండలంలోని దొంతాన్పల్లి గ్రామానికి చెందిన గడుసు అశోక్, అతని వదిన కొడుకు కట్ట గోపీ పవన్ కలిసి ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున మహాలింగపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్యను వేట కొడవలితో నరికి హత్య చేశారు. అశోక్ చెల్లెలు అమృతకు 23 ఏండ్ల కింద మహాలింగపురం గ్రామానికి చెందిన బోడ రాములుతో వివాహం చేశారు. ఆమె భర్త 13 ఏండ్ల కింద ప్రమాదంలో మృతి చెందాడు. ఆమె కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది.
అశోక్కు దొంతాన్పల్లిలో 2.18 ఎకరాల పొలం ఉంది. ఆ భూమిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని అమృత కోర్టులో కేసు వేసింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా ఆమె రాజీకి రాలేదు. ఆమె మరిది బోడ వెంకటయ్య ఆస్తి విషయంలో వదినకు నచ్చ చెప్పినా వినలేదు. ఆరు నెలల కింద అశోక్ భూమి తగాదా విషయం వెంకటయ్యతో చర్చించారు. ఇద్దరూ చెప్పినా వినకపోవడంతో ఆమెను హత్య చేయాలని అశోక్ నిర్ణయానికి వచ్చాడు. తనకు రూ.5లక్షలు ఇస్తే వదినను హత్య చేస్తానని చెప్పి, ఆశోక్ వద్ద రూ.4లక్షల వరకు బోడ వెంకటయ్య తీసుకున్నాడు. డబ్బులిచ్చినా అమృతను ఎందుకు చంపలేదని అశోక్ వెకటయ్యతో గొడవ పడేవాడు. 15 రోజుల కింద ఇంటి నిర్మాణ పనుల కోసం తన వదిన కొడుకు సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం రెండ్లపల్లికి చెందిన కట్ట గోపీపవన్ను అశోక్ పిలుచుకున్నాడు.
బోడ వెంకటయ్య, అశోక్ ఫోన్లో గొడవ పడే విషయాన్ని గోపీపవన్ గమనిస్తూ వచ్చాడు. ఈ నెల 10న రూ.50 వేలు కావాలని, కొత్తవారితో అమృతను హత్య చేయిస్తానని వెంకటయ్య అశోక్తో చెప్పాడు. డబ్బులివ్వకుంటే అందరికీ ఈ విషయం చెప్తానని బెదిరించాడు. ఈ క్రమంలో తనకు రూ.10వేలు ఇస్తే వెంకటయ్యను హత్య చేస్తానని కట్ట గోపీపవన్ అనడంతో అదే రోజు రాత్రి ఆల్టో కారు టీఎస్ 07 ఈయూ 0359లో వేట కొడవలి, కారంపొడితో ఇద్దరూ బయలు దేరారు. 11వ తేదీ రాత్రి సుమారు 2గంటల ప్రాంతంలో వెంకటయ్యకు ఫోన్ చేసి ఆలంఖాన్గూడ గేటు సమీపంలోని శుభగృహ వెంచర్ వద్దకు రావాలని తెలుపారు. ఆయన బైక్పై అక్కడికి వెళ్లి అశోక్తో మాట్లాడుతుండగా పొదల చాటున ఉన్న కట్ట గోపీపవన్ వేట కొడవలితో వెంకటయ్యపై విచక్షణా రహితంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం మృతదేహం చుట్టుపక్కల కారం పొడి చల్లి వారిద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయారు. వెంకటయ్య మృతి చెందిన విషయం తెలుకున్న భార్య హంసమ్మ శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ డాటా ఆధారంగా అశోక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుల నుంచి కారు, సెల్ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సీఐతో సీఐ మహేశ్గౌడ్, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, సంజీవ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.