యాచారం : మండలంలోని నానక్నగర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో సంచరించిన చిరుత శనివారం అర్ధరాత్రి మేకల మందపై దాడి చేసింది. మంద నుంచి మేకను ఎత్తుకెళ్లి సమీపంలో ఉన్న గుట్టపైకి తీసుకెళ్లి బండచరియలో చంపి తినేసింది. ఈ ఘటన గ్రామంలో ఆదివారం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు, అధికారుల కథనం ప్రకారం.. నానక్నగర్ గ్రామానికి చెందిన తాండ్ర రామచంద్రయ్య అనే రైతు పొలంలో చిరుతపులి సంచరించి మేకల మందపై దాడి చేసింది. మేకను బలవంతంగా ఎత్తుకెళ్లి సమీపంలో ఉన్న కొండగుట్టపైకి తీసుకెళ్లింది. గుట్టపై ఉన్న బండచరియలో చంపి తినేసింది. ఆదివారం పొలం వద్ద రైతు మేక లేదని గుర్తించాడు. చుట్టుపక్కల మేక గూర్చి గాలించాడు. మేకను ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లను గుర్తించిన రైతు వాటి ఆధారంగా నేరుగా గుట్టపైకి వెళ్లి చూశాడు.
అక్కడ మేక చనిపోయి ఉండటాన్ని గుర్తించాడు. మేక శరీర భాగాలు వేరువేరుగా పడిఉండటాన్ని గమనించిన రైతు మేకను ఏదో జంతువు ఎత్తుకెళ్లి తినేసిందని గుర్తించి బోరున విలపించాడు. వెంటనే గ్రామ సర్పంచ్ దంతుక పెద్దయ్యకు సమాచారం అందించాడు. గ్రామస్తులు, రైతులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్ పెద్దయ్య సంబంధిత ఫారెస్టు బీట్ ఆఫీసర్కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ సంఘటన స్థలాన్ని పరిశీలించాడు. మేక ఉన్న స్థలం, మేకను పులి తిన్న స్థలాన్ని క్షున్నంగా పరిశీలించాడు. అక్కడ గుర్తించిన ఆనవాళ్ల ప్రకారం మేకను చిరుతపులి చంపి తిన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. గతంలో తాటిపర్తి, కొత్తపల్లి, మేడిపల్లి, నానక్నగర్, నందివనపర్తి గ్రామాలలోనూ చిరుత సంచరించి ఎన్నో మూగ జీవాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు చిరుత పీడ విరగడయ్యిందనుకున్న రైతులకు మళ్లీ చిరుత కలకలం రేపడంతో గొర్రెల కాపరులు, రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు.
చిరుత ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని దిగులు చెందుతున్నారు. ఫారెస్టు అధికారులు వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల్లో బోను ఏర్పాటు చేసి చిరుతను బందించి మూగజీవాలను కాపాడాలని రైతులు, గొర్రెల కాపరులు, ప్రజలు కోరుతున్నారు. నానక్నగర్ గ్రామస్తులతో పాటుగా పరిసర ప్రాంతాలైన మేడిపల్లి, తాటిపర్తి, కొత్తపల్లి, నందివనపర్తి గ్రామాల రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు.