కాటారం : జాతీయ రహదారిపై కాటారం శివారులో ఆదివారం మారుతి ఈకో వ్యాన్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్లోని కాశీబుగ్గకు చెందిన దాసరి కిరణ్కుమార్ కుటుంబ సభ్యులు కాళేశ్వరానికి దైవదర్శనంకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కాటారం శివారులోని పల్నాటి హోటల్ సమీపంలోకి రాగానే ఎదురుగా మరో లారీని ఓవర్ టేక్ చేస్తూ అతివేగంతో వచ్చి టీఎస్07యూఈ9369 నంబరు గల లారీ మారుతి వ్యాన్ను ఢీకొట్టింది.
దీంతో కిరణ్కుమార్, భార్య కల్పన, అమ్మ సరోజన, కూతురు మనీషా, వదిన రాజేశ్వరికు తీవ్ర గాయాలయ్యాయి. తలకు, చేతులకు బలమైన గాయాలు కావడంలో రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ రంజిత్రావు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులను వ్యానులో నుంచి బయటకు తీశారు. 108లో క్షతగాత్రులను మహాదేవపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
కిరణ్కుమార్ కుమారుడు చైతన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ శంకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సుధాకర్ తెలిపారు. కాగా జేసీబీ సాయంతో వాహనాలను సంఘటన స్థలం నుంచి తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.