ఇబ్రహీంపట్నంరూరల్ : రంగారెడ్డి జిల్లా బొంగుళూరు ఔటర్రింగ్రోడ్డు సమీపంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలలేని మొండెం భాగాన్ని ఆదిబట్ల పోలీసులు గుర్తించారు. సీఐ నరేందర్ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా వద్దిపట్లకు చెందిన నామా శ్రీనివాస్ (42) బొంగుళూరులో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో బీఎన్రెడ్డి ప్రాంతంలో నివాసముండే నల్గొండ జిల్లావాసులైన బ్రహ్మచారి, నరేష్, రాజమ్మ అలియాస్ రాజుతో శ్రీనివాస్కు పరిచయం ఏర్పడింది. కాగా గత నెల రోజుల క్రితం శ్రీనివాస్ కనిపించకుండా పోవటంతో డిసెంబర్ 14న ఆయన కుటుంబ సభ్యులు ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుపై విచారణ జరుపుతుండగా ఆయన స్నేహితుల్లో ఒకరైన బ్రహ్మచారి సరూర్నగర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
బ్రహ్మచారి తక్కువ రకం బంగారం తయారు చేయించి తాకట్టు దుకాణాలు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టుపెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలో బ్రహ్మచారి మోసాన్ని గుర్తించిన ఓ ఫైనాన్స్ సంస్థ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని సరూర్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్రహ్మచారిని బంగారం కేసులో విచారిస్తున్న క్రమంలో శ్రీనివాస్ అదృశ్యంపై కూడా విచారించగా అసలు విషయం బయటపడింది. నవంబర్ 12న తన స్నేహితులైన నరేష్, రాజమ్మ (అలియాస్) రాజుతో కలిసి శ్రీనివాస్ను హతమార్చినట్లు నిందితుడు బ్రహ్మచారి అంగీకరించాడు. బొంగుళూరు ఓఆర్ఆర్ సర్వీసురోడ్డు పక్కన అటవీప్రాంతంలో శ్రీనివాస్ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు చెప్పాడు.
దీంతో పోలీసులు బ్రహ్మచారి ఇచ్చిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఆదిబట్ల సీఐ నరేందర్ సిబ్బందితో కలిసి ఇబ్రహీంపట్నం తాసీల్దార్ అనిత సమక్షంలో ఘటనా స్థలంలో విచారణ జరిపారు. అక్కడ తలలేని మృతదేహంతో పాటు పార, రెండు గంపలు, తీగను పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయి నిర్ధారణ కోసం మృతుడి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. నిందితుల్లో మరో ఇద్దరైన నరేష్, రాజమ్మ అలియాస్ రాజులు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నామని, నిందితులు దొరికితే ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం బయటకి వస్తుందని సీఐ నరేందర్ తెలిపారు.