షాబాద్ : ఈసీ వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగరగూడ గ్రామానికి చెందిన శ్రీనివాస్(22) ఈ నెల 24న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో మరుసటి రోజు కుటుంబసభ్యులు అతడి కోసం వెతకగా ఎక్కడ ఆచూకీ లభించలేదు.
సోమవారం నాగరగూడ ఈసీ వాగు వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూడగా శ్రీనివాస్గా గుర్తించారు. వాగులోకి చేపలు పట్టేందుకు వెళ్లిన తన కొడుకు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెంది ఉంటాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.