Virat Kohli | కోహ్లీ కుమార్తెపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఒక క్రికెటర్ ప్రస్తావన ఉన్న కారణంగా బెయిలు నిరాకరించలేమని కోర్టు తేల్చిచెప్పింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో తన తొలి మ్యాచ్లోనే భారత జట్టు.. దాయాది పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.
దీంతో భారత పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేస్తూ, అతన్ని దేశద్రోహి అంటూ నెట్టింట చాలామంది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో షమీకి కోహ్లీ అండగా నిలబడ్డాడు. ఆ తర్వాతే కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె వామిక ఫొటో కోసం ఎదురు చూస్తున్నానని, అది వస్తే ఆ పాపపై అత్యాచారం చేస్తానని ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు.
ఇది దేశంలో పెద్ద దుమారమే రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ట్వీట్ చేసింది.. హైదరాబాద్కు చెందిన రామ్నగేష్ ఆకుబత్తిని అనే ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ అని గుర్తించారు. 23 ఏళ్ల అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుడు బెయిలు కోసం కోర్టులో పిటిషన్ వేశాడు.
దీనిపై విచారణ సందర్భంగా.. ‘కేవలం ఒక గౌరవనీయుడైన క్రికెటర్ ప్రస్తావన ఉన్నందున బెయిలు నిరాకరించలేం’ అని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు విచారణ పూర్తయిందని, అతను సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం కూడా లేదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా రామ్నగేష్కు క్రిమినల్ రికార్డు కూడా లేదన్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ క్రమంలోనే అతనికి బెయిలు మంజూరు చేసింది.