కోల్కతా: బాలికతో సహా నలుగురు కుటుంబ సభ్యులను భార్యాభర్తలు హత్య చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా సమీపంలో ఈ దారుణం జరిగింది. దేబ్రాజ్ ఘోష్, అతడి సోదరుడు దేబాసిస్ ఘోష్ కలిసి హౌరాలోని పూర్వీకులకు చెందిన రెండస్తుల మేడలో తమ కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. అయితే ఆస్తుల విషయంపై ఈ రెండు కుటుంబాల మధ్య తరచుగా గొడవ జరిగేది.
కాగా, బుధవారం కూడా ఈ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. తాగు నీరు పట్టుకునే విషయంపై పల్లవి, రేఖ మధ్య గొడవ మొదలైంది. ఇది రెండు కుటుంబాల మధ్య కోట్లాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో దేబ్రాజ్ ఘోష్, అతడి భార్య పల్లవి కలిసి దేబాసిస్ ఘోష్, అతడి భార్య రేఖ, వారి 13 ఏళ్ల కుమార్తెతోపాటు తల్లిపై కత్తితో దాడి చేశారు. కత్తి పోట్ల వల్ల తీవ్రంగా గాయపడిన వారంతా రక్తం మడుగుల్లో పడి మరణించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న పల్లవిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దేబ్రాజ్ ఘెష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.