మైలార్దేవ్పల్లి : పరుపులు తయారు చేసే పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గత మూడు సంవత్సరాలుగా ఆలాం అనే వ్యక్తి కాటన్తో పరుపులు తయారు చేసే పరిశ్రమను నిర్వహిస్తున్నాడు.
పరుపుల తయారీకి కాటన్ బట్టలను ఉపయోగిస్తారు. దీనికోసం ఓ గోదాములో కాటన్ బట్టలను నిల్వ ఉంచాడు. మంగళవారం ఆర్థరాత్రి నిల్వ ఉంచిన కాటన్ గోదాములో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. కాలనీ అంత పొగతో నిండిపోవడంతో భయాందోళన చెందిన స్థానికులు.యువకులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి మైలార్దేవ్పల్లి కైమ్ డీఐ రాజేందర్గౌడ్ ఫైర్ ఇంజన్లను రప్పించారు. అప్పటికే భారీగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు మూడు ఫైర్ ఇంజన్లతో శ్రమపడి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. దీంతో చుట్టు ప్రక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఆగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కలుగలేదు. సుమారు ఏడు లక్షల వరకు ఆస్తి నష్టం కలిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకోని అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇండ్ల మధ్య గోదాములు
గత కొన్ని సంవత్సరాలుగా వినాయకనగర్లో అనుమతి లేకుండానే ఇండ్ల మధ్య అనేక పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. ఈవిషయంలో సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహారిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. జనవాసాల మధ్య గోదాములు ఉండడంతో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
ఫైర్ సేప్టి లేకుండా ఇష్టానుసారంగా పరిశ్రమలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పరిశ్రమలను జనవాసాల మధ్య నుండి తీయించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.