ధేంకనల్: కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్కు తరలించాలని ఒకవైపు ఆరోగ్యశాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ భయం కూడా పెరగడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకిన విద్యార్థులకు ఇంటికెళ్లడానికి పర్మిషన్ ఇచ్చాడో కాలేజ్ ప్రిన్సిపాల్.
ఈ ఘటన ఒడిషాలోని ధేంకనల్ ప్రాంతంలో వెలుగు చూసింది. ఇక్కడ స్థానికంగా ఉన్న కాలేజ్ విద్యార్థులకు తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 270 మందికి కరోనా టెస్టులు చేయగా.. వారిలో 56 మందికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇలా కరోనా పాజిటివ్ వస్తే.. సదరు విద్యార్థులను కాలేజ్ హాస్టల్లోనే ఐసోలేషన్లో ఉంచాలి.
కానీ సదరు కాలేజ్ ప్రిన్సిపాల్ మాత్రం.. కరోనా సోకిన విద్యార్థులను ఇళ్లకు పంపించేశాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. సదరు ప్రిన్సిపాల్, కాలేజ్ యజమానిపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిందితులు తీవ్రమైన నిర్లక్ష్య వైఖరితో వ్యవహిరించారని మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.