ఖమ్మం:ప్రజల భద్రతకు భరోసా కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ ఇంజరాపు పూజ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి సుభాష్ చంద్ర బోస్, టౌన్ ఏసీపీ అంజనేయులు ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నగరంలోని రమణగుట్ట, వికలాంగుల కాలనీలో ఖమ్మం టౌన్ డివిజన్ పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని నలబై రెండు ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలను, మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా డీసీపీ ఇంజరాపు పూజ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై, పాత నేరస్తుల కదలికపై నిరతరం నిఘా ఉంటుందన్నారు. స్దానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వుండాలని సూచించారు. నేరాల నివారణ చర్యలలో భాగంగా స్దానిక ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంత్రాలు ,పూజలతో అమాయక ప్రజలకు మాయ మాటలు చేబుతూ అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్ల మాటలు నమ్మి మోస పోవద్దని అన్నారు.
ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని, బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని, ఏ బ్యాంక్ సిబ్బంది అయిన కార్డ్ నంబర్, పిన్, ఓటిపి, సివివి వివరాలను ఎప్పుడూ అడిగే అవకాశం లేదని ఆమె వివరించారు. ఒకవేళ ఎవరైనా అడిగితే వారు సైబర్ నేరగాళ్లని గుర్తించాలని అన్నారు. బ్యాంక్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. అనుమతి లేని ప్రవేటు చీట్స్ ఫండ్స్ లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయిన డయల్ వంద నంబర్ కు లేదా స్దానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుట్టామని డీసీపీ పూజ తెలిపారు.