వనస్థలిపురం : యాజమాన్యం వేధింపులతో ఓ చిట్ఫండ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. సాయినాథ్ కాలనీలో నివాసముండే గంగాధరి సత్యనారాయణ(46) విజయదుర్గా చిట్ఫండ్ కంపనీలో పనిచేస్తున్నాడు. తను పనిచేసే సంస్థలో వసూలు చేసిన డబ్బులు వాడుకున్నాడని ఆరోపిస్తూ సంస్థ యజమాని మల్లారెడ్డి సత్యనారాయణను తిట్టాడు.
దీంతో మనస్థాపానికి గురైన మృతుడు గత మూడు రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. మంగళవారం భార్యతో కలిసి ఇంటి వద్దనే ఉన్న సత్యనారాయణ సాయంత్రం భార్య బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్య తలుపు గడియ వేసి ఉండడంతో తెరిచేందుకు విఫలయత్నం చేసింది.
ఇంటి యజమాని సహాయంతో తెరిచి చూడగా సత్యనారాయణ తాడుకు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. చిట్ఫండ్ యాజమాన్యం వేధింపుల కారణంగా తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు