ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో మహిళా భద్రతా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుతుబుద్దీన్పై ఓయూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఐపీసీ 354 కింద కేసు నమోదు చేసినట్లు ఓయూ సీఐ రమేశ్నాయక్ తెలిపారు.
దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై ఓయూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్త్ సెంటర్లో ఇతర మహిళా ఉద్యోగినులతో మాట్లాడి నివేదిక రూపొందించి నట్లు చెప్పారు. నివేదికను కాన్ఫిడెన్షియల్గా పేర్కొంటూ దానిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పడం గమనార్హం.
అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగులంతా తాము కూడా వేధింపులకు గురి అయ్యామని చెప్పినట్లు భోగట్టా. మరోవైపు ఓయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గణపతి జాదవ్ సైతం ఘటన పట్ల నోరు తెరవకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలు ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నందున, ఆ ఏజెన్సీ బాధ్యులనే వివరాలు అడగాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని రక్షించేందుకు పలువురు ఇప్పటికే రంగంలోకి దిగి, బాధితురాలితో సైతం చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఘటనను పెద్దది చేయకుండా కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నిస్తు న్నట్లు తెలిసింది. విధులకు హాజరుకాకుండా కుతుబుద్దీన్ను సస్పెండ్ చేసినట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.