సికింద్రాబాద్ : ఓ యువకుడు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దపల్లి జిల్లా, మండలం అందుగులపల్లికి చెందిన బాధితురాలు (24) మూడు సంవత్సరాలుగా ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఆపరేటర్గా పనిచేస్తూ మేడ్చల్లోని ఓ ప్రైవేటు మహిళా వసతిగృహంలో ఉంటున్నది. నాలుగు సంవత్సరాల క్రితం తన అక్క వివాహంలో ఆమెకు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దెపాక గ్రామానికి చెందిన ఊకంటి రాజేంద్రప్రసాద్ (26) తో పరిచయం ఏర్పడింది.
పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే నిందితుడు బాధితురాలిని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో న్యూ బోయిన్పల్లిలోని ఓయో గదిలో ఇరువురు పలుమార్లు శారీరకంగా ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే నిందితుడు ఫొటోలు, వీడియోలను తీశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
తనను వివాహం చేసుకోవాలని అడిగినప్పుడల్లా నిందితుడు దాటవేస్తు వస్తున్నాడు. కొద్దిరోజులుగా పెండ్లిచేసుకోనని, ఒకవేళ ఇతరులను వివాహం చేసుకుంటే తన వద్దనున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.