బంజారాహిల్స్ : బ్యాంకు ఖాతాలో వివరాలు నమోదు చేసుకోకపోవడంతో బ్లాక్ చేస్తున్నామని మెసేజీ పంపించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని సాగర్ సొసైటీలోని సద్గురు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న ప్రవీణ్కుమార్కు గత నెల 20న గుర్తుతెలియని నెంబర్ నుంచి మెసేజీ వచ్చింది.
ఎస్బీఐ బ్యాంకు అకౌంట్లో డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోవడంతో ఖాతాను నిలిపివేస్తున్నామని, వివరాలను అప్డేట్ చేసేందుకు తాము పంపిన లింక్ క్లిక్ చేయాలని మెసేజీలో వచ్చింది. దాంతో లింక్ను క్లిక్ చేయడంతో పాటు కోరిన వివరాలు అందించారు.
అప్డేట్ ప్రక్రియను పూర్తిచేయాలంటే ఓటీపీ నెంబర్ పంపిస్తున్నామని, దాన్ని తమకు చెప్పాలని కోరడంతో ఓటీపీ నెంబర్ పంపించాడు. దాంతో అతడి ఖాతాలోనుంచి రూ.20వేలు మాయమయ్యాయి. ఈ మేరకు బాధితుడు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.