బంజారాహిల్స్ : అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్ రోడ్ నెం 2లో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందిన కారును తీసుకుని డ్రైవర్ గంగాప్రసాద్ సోమవారం ఉదయం పనిమీద హఫీజ్పేట వెళ్లేందుకు బయలుదేరాడు. జూబ్లీహిల్స్ చెక్పోస్ఠ్ దాటగానే అదుపుతప్పిన కారు మెట్రోపిల్లర్ను ఢీ కొట్టడంతో పల్టీలు కొట్టింది.
అయితే డ్రైవర్ సీటు బెల్టు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ట్రాఫిక్ లేకపోవడంతో ముప్పు తప్పింది.