కాసిపేట : గంజాయి, నిషేదిత పొగాకు, గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ హెచ్చరించారు. గురువారం కాసిపేట పోలీస్ స్టేషన్లో కోమటిచేనే గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి కామెర రాజయ్యను గంజాయి విక్రయ కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో రాజయ్య గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో కాసిపేట ఎస్ఐ, తాసీల్దార్తో కలిసి దాడి చేసి అతడి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని పట్టుకున్నామని వివరించారు.
తిర్యానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి గ్రామంలో యువతకు విక్రయిస్తూ, తాను సేవిస్తున్నాడని వెల్లడించారు. రాజయ్య పై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయిని సాగు చేసినా, సేవించినా చట్టరీత్య తగిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మందమర్రి సీఐ ప్రమోద్ రావు, కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేశ్ పాల్గొన్నారు.