కైరో : ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 41 మంది దుర్మరణం పాలవగా.. 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చిలో మంటలు చెలరేగాయి. అయితే, ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా.. మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి 15 ఫైర్ ఇంజిన్లను తరలించి, మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదంలో గాయపడ్డవారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాఫ్ ఎల్ సీసీ సంతాపం ప్రకటించారు.