న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ స్కామ్ బయటపడింది. ఢిల్లీకి చెందిన 11 మంది వ్యాపారులు ఐదు బ్యాంకులను నిండాముంచారు. వ్యాపారులు ఐదు బ్యాంకులను రూ 1400 కోట్లకు మోసగించినట్టు వెల్లడైంది. వ్యాపారులు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన ఉదంతంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. వ్యాపారులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై బడా స్కామ్కు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులకు వ్యాపారులు టోకరా వేసిన కేసులో పూర్తి వివరాలు వెల్లడికావాల్సిఉంది.
బాబాల పేరుతో కుచ్చుటోపీ
ఇక మరో ఘటనలో అతీంద్రియ శక్తులతో సమస్యలు పారదోలుతామని తమకు తాము బాబాలుగా చెప్పుకుని ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను 29 ఏండ్ల వయసున్న ఢిల్లీకి చెందిన షహిల్, రఫీక్లుగా గుర్తించారు. గతంలో వీధుల్లో ఇంద్రజాలం ప్రదర్శిస్తూ పొట్టపోసుకున్న వీరు అధిక మొత్తం సంపాదించాలనే ఆశతో బాబాలుగా అవతారమెత్తారు. వీరిద్దరూ ఇటీవల వ్యాపార నిమిత్తం రాజస్ధాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యాపారి ఆయన స్నేహితులు ఇద్దరిని మోసగించారు. మార్చి 31న వ్యాపారి ఆయన స్నేహితులు ట్యాంక్ రోడ్లోని హోల్సేల్ మార్కెట్కు వచ్చారు.
నిందితుల్లో ఒకరు వీరితో సంభాషణ సాగించారు. వ్యాపారంలో విజయవంతమయ్యేలా తాను సహకరిస్తానని నమ్మబలికాడు. ఆపై మరో నిందితుడు వారిని చేరుకుని బాబాగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి వారికి మేజికల్ స్టోన్ను ఇచ్చారు. తాము చెప్పినవి పాటిస్తే అది సిల్వర్ స్టోన్గా మారుతుందని మభ్యపెట్టారు.
మరో మేజికల్ స్టోన్ను వారికి అప్పగించడంతో బాధితులు బాబాకు రూ 75,000 ఇచ్చారు. ఆపై ఈ రాళ్లను వెనక్కితిరిగి చూడకుండా దూరంగా పడేయాలని కోరారు. వారు చెప్పినట్టే రాయిని పడేసేందుకు వారు వెనుతిరిగిన మరుక్షణం నిందితులు ఇద్దరూ పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని లూటీ సొమ్మును ఫిర్యాదుదారులకు అందచేశారు.