బంజారాహిల్స్,సెప్టెంబర్ 3 : డుగ్గు డుగ్గు ..అంటూ సౌండ్ చేసే బుల్లెట్ బండిని చడీచప్పుడు కాకుండా తస్కరించాడు ఓ ఆగంతకుడు. ఇంటిముందు పార్క్ చేసిన తన బుల్లెట్ బండి కనిపించకపోవడంతో ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించగా గుర్తుతెలియని యువకుడు బండిని తోసుకుంటూ తీసుకువెళ్లిన దృశ్యం కనిపించింది.
ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని నిందితుడికోసం గాలింపు చేపట్టారు.
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీని అనుకుని ఉన్న ఇందిరానగర్ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసం ఉంటున్న జువేర్ జలాల్ అనే యువకుడికి చెందిన బుల్లెట్ బైక్(టీఎస్ 09ఈయూ 4062)ను ఈనెల 1న రాత్రి తన ఇంటిముందు పార్క్ చేశాడు. మరుసటిరోజున ఉదయం బయటకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దాంతో తన ఇంటిముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించాడు.
ఓ యువకుడు ఉదయం 6గంటల ప్రాంతంలో పార్క్ చేసిన బుల్లెట్ బండిని తోసుకుంటూ వెళ్తున్న దృశ్యం కనిపించింది. దాంతో దారి పొడువునా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఎమ్మెల్యే కాలనీలోని ఒమేగా దవాఖాన వరకు బండిని తోసుకుంటూ వెళ్లినట్లు తేలింది. అక్కడినుంచి సీసీ కెమెరాలకు చిక్కకుండా పరారయ్యాడని తేలింది.
ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం బాదితుడు జువేర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.