జైపూర్ : క్షణికావేశంలో కొందరు చిన్న కారణాలకే ఎదుటివారి ప్రాణాలు తీసేస్తున్నారు. సిల్వర్ బ్రేస్లెట్ కోసం జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన మైనర్ బాలుడు 45 ఏండ్ల వితంతు మహిళను హత్య చేసిన ఘటన రాజస్ధాన్లోని అజ్మీర్ జిల్లాలో జరిగింది. మే 22న తడ్పార ప్రాంతంలోని బాధితురాలి గృహంలో కుళ్లిన స్ధితిలో మహిళ మృతదేహం గుర్తించారు. మృతురాలిని లలితా కన్వర్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైనర్ నిందితుడు గురుగ్రాంలోని టైల్స్ పరిశ్రమలో పనిచేస్తుండగా ఆపై అహ్మదాబాద్కు మకాం మార్చాడు. 8 నెలల కిందట నిందితుడు అజ్మీర్కు తిరిగివచ్చి హోటల్లో పనిచేస్తున్నాడు. నిందితుడితో పనిచేసే మరో వ్యక్తి కన్వర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అదే ఇంట్లో నిందితుడు ఉండటంతో బాధితురాలితో స్నేహం పెంచుకున్నాడు. వీరిద్దరూ ఫోన్ నెంబర్లను పరస్పరం మార్చుకున్నారు.
మే 18న బాలుడిని లలితా కన్వర్ డిన్నర్కు ఆహ్వానించగా ఆ రాత్రి అక్కడే గడిపాడు. మరుసటి రోజు ఉదయం తన సిల్వర్ బ్రాస్లెట్ కనిపించకపోవడంతో ఇదే విషయాన్ని ఆమెతో ప్రస్తావించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో బాలుడు ఆమె తలపై కర్రతో బలంగా కొట్టడంతో కన్వర్ అక్కడికక్కడే మరణించింది. మృతురాలి నుంచి నెక్లెస్, మొబైల్ ఫోన్ తీసుకున్న నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read More