Bomb rumor | విమానంలో బాంబు ఉన్నదంటూ గ్రౌండ్ సిబ్బందికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ రంగంలోకి దిగి అణువణువూ జల్లెడ పట్టారు. చివరకు బాంబు బూటకమని తేల్చిచెప్పారు. దాంతో విమానంలోని ప్రయాణికులు, విమాన సిబ్బంది అంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డీఎస్సీ రవికుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరేందుకు స్పైస్ జెట్ విమానం సిద్ధంగా ఉన్నది. ఇంతలో ఓ వ్యక్తి నుంచి గ్రౌండ్ సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. ముంబైకి వెళ్తున్న విమానంలో బాంబు ఉన్నదని చెప్పాడు. దాంతో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. విమానం అంతా జల్లెడ పట్టి బాంబ్ కాల్ ఫేక్ అని తేల్చింది. అయితే, ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకుని విచారించగా.. తన స్నేహితుడి గర్ల్ఫ్రెండ్ పుణె వెళ్లిపోతున్నదని, ఆమెను నిలువరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్లో ట్రైనీ టికెటింగ్ ఏజెంట్ అభినవ్ కుమార్ ఈ పనికి పాల్పడినట్లు తేలింది. దాంతో ఢిల్లీ పోలీసులు అభినవ్ను అరెస్ట్ చేశారు. కాగా, అతడి స్నేహితులు కునాల్, రాకేశ్లు పరారీలో ఉన్నారు.
రాకేశ్, కునాల్ మనాలీ వెళ్లగా అక్కడి ఇద్దరు అమ్మాయిలతో స్నేహం కుదిరింది. వారంతా అక్కడ ఎంజాయ్ చేసిన అనంతరం పుణె వెళ్లేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యారు. మరో నాలుగు రోజులు ఢిల్లీలో ఉండాలని కోరినా వారు నిరాకరించడంతో.. రాకేశ్, కునాల్ ఇద్దరూ తమ స్పేహితుడైన అభినవ్ కుమార్ సాయం కోరారు. దాంతో ఢిల్లీ-ముంబై విమానంలో బాంబు ఉన్నదని అధికారులకు బెదిరింపు కాల్ చేసి అభినవ్ దొరికిపోయాడు.