అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈతకు వెళ్లి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థుల మృతదేహాలు ఈ రోజు లభ్యమయ్యాయి. చరణ్, బాలయేసు, అజయ్, సన్నీ మృతదేహాలు లభ్యం కాగా రాకేశ్ అనే విద్యార్థి అచూకీ కోసం గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరు గ్రామం వద్ద మున్నేరువాగులో సోమవారం మధ్యాహ్నం స్నానాలకు వెళ్లిన ఐదుగురు కట్టె పుల్లలు తీసుకురావడానికి సైకిళ్లపై బయలు దేరారు. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి పిల్లలు కనిపించకపోవడంతో వారి కోసం వెతకడం ప్రారంభించారు. వారు మున్నేరు వైపు వెళ్లారని పశువుల కాపరి చెప్పడంతో అక్కడకు వెళ్లి చేసే సరికి పిల్లల దుస్తులు , సైకిళ్లు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సహాయతో రాత్రి వరకు గాలించారు.
మంగళవారం ఉదయం సమీపంలోని కొద్దిదూరంలో నలుగరు మృతదేహాలు లభ్యం కావడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.