బెంగళూరు: ఇంట్లో దాగి ఉన్న నిధిని బయటకు తీస్తానని చెప్పి, ఒక మహిళను నగ్నంగా కూర్చోబెట్టిన పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాహికుమార్ అనే పూజారి తమిళనాడుకు చెందిన వాడు. కర్ణాటకలోని రామనగర ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు.. తెలిసిన వాళ్ల పెళ్లి కోసం తమిళనాడు వెళ్లినప్పుడు వీరిద్దరికీ పరిచయమైంది.
శ్రీనివాస్ ఉండే భవనం అతని పూర్వీకులు 75 ఏళ్ల క్రితం కట్టింది. ఆ భవనానికి ఒకసారి వచ్చిన షాహికుమార్.. ‘మీ ఇంట్లో ఒక పురాతనమైన నిధి దాచిపెట్టారు. అది బయటకు తీయలేదంటే మీ కుటుంబానికి కష్టాలు తప్పవు’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న సదరు శ్రీనివాస్ ఆ నిధి బయటకు తీయాలని కుమార్ను కోరాడు. ఇదంతా 2019లో జరిగింది.
అప్పటి నుంచి కరోనా సాకు చూపించి ఈ పనిని కుమార్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీనివాస్ ఇంటికెళ్లిన అతను.. ఆ నిధి బయటకు రావాలంటే శ్రీనివాస్ ఒక స్త్రీ నగ్నంగా తన ముందు కూర్చొని పూజలో పాల్గొనాలని, ఆమె అతని కుటుంబ సభ్యురాలైతే ఇంకా మంచిదని చెప్పాడు. దీనికి శ్రీనివాస్ తర్జనభర్జనలు పడ్డాడు.
అయితే భార్యను పంపడానికి నిరాకరించిన శ్రీనివాస్ ఒక కూలీ పని చేసుకునే మహిళతో మాట్లాడాడు. ఆమెకు రూ.5 వేలు ఇచ్చి పూజలో పాల్గొనాలని చెప్పాడు. ఆమె దానికి అంగీకరించి వచ్చింది. పూజ సమయంలో శరీరంపై నూలుపోగు లేకుండా కూర్చుంది. ఈ పూజ జరిగే ప్రాంతానికి ఆ మహిళ నాలుగేళ్ల కూతుర్ని కూడా తీసుకొచ్చారు.
బలి ఇవ్వడానికే ఆ పాపను తెచ్చారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సదరు పూజారి, ఆ కుటుంబంపై అనుమానాలు వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు షాహికుమార్తోపాటు అతని సహాయకులైన మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం.