Karnataka | బెంగళూరు : ఓ యువకుడు తన దూరపు బంధువైన ఓ అమ్మాయితో గత కొద్ది నెలల నుంచి ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ గత రెండు వారాల్లో ఒకట్రెండు సార్లు కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు.. ఆమె ప్రియుడిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా అతడిని కిడ్నాప్ చేసి నిప్పంటించారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజరాజేశ్వరి నగర్కు చెందిన శశాంక్(18) స్థానికంగా ఉన్న ఏసీఎస్ కాలేజీలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శశాంక్ తన దూరపు బంధువైన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలో ఇద్దరూ కొద్ది రోజుల క్రితం కలుసుకున్నారు.
ఈ విషయం యువతి కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసింది. దీంతో శశాంక్ను హెచ్చరించారు. అంతటితో ఆగకుండా శనివారం కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న శశాంక్ను అమ్మాయి తరపు బంధువులు ఏడుగురు కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి శశాంక్కు నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన శశాంక్ బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే తమ అమ్మాయితో బంధం కొనసాగిస్తే కాల్చి చంపుతానని అమ్మాయి మేనమామ గతంలో బెదిరించినట్లు శశాంక్ తండ్రి రంగనాథ్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.