బెంగళూరు: వ్యాపార లెక్కల్లో రూ.1.5 కోట్లు తేడా రావడంతో కుమారుడికి తండ్రి నిప్పంటించాడు. మంటలు అంటుకుని తీవ్ర గాయాలతో కుమారుడు మరణించాడు. దీంతో వ్యాపారవేత్త అయిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. వాల్మీకినగర్కు చెందిన సురేంద్ర ఫ్యాబ్రికేషన్ వ్యాపారం చేస్తున్నాడు. 25 ఏండ్ల కుమారుడు అర్పిత్ కూడా వ్యాపార వ్యవహారాలు చూస్తున్నాడు. అయితే వ్యాపార లెక్కల్లో రూ.1.5 కోట్ల మేర తేడా వచ్చింది. దీంతో దీనికి సంబంధించిన వివరాలు చెప్పాలని కుమారుడు అర్పిత్ను తండ్రి సురేంద్ర నిలదీశాడు.
ఏప్రిల్ 1న ఇంటి వద్ద ఈ విషయంపై తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. సురేంద్ర ఆగ్రహంతో అర్పిత్పై పెయింట్ థిన్నర్ను పోశాడు. నిప్పుపెట్టబోగా ఆ యువకుడు పరుగున ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతడి వెనకే పరుగెత్తి వచ్చిన సురేంద్ర అగ్గి పుల్ల వెలిగించాడు. కుమారుడు ఎంత వేడుకున్నా ఆయన కనికరించలేదు. అయితే సురేంద్ర మొదటి ప్రయత్నం ఫలించలేదు. రెండోసారి అగ్గిపుల్ల గీసి అర్పిత్ మీదకు విసిరాడు. దీంతో థిన్నర్తో తడిసి ఉన్న అతడి దుస్తులకు మంటలు అంటుకున్నాయి.
అయితే అర్పిత్ మంటలతోనే రోడ్డుపై పరుగెత్తాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. 60 శాతం కాలిన గాయాలైన ఆ యువకుడ్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా ప్రాణాలతో పోరాడిన అర్పిత్ చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. దీంతో పొరుగు వ్యక్తి ఫిర్యాదుతో అర్పిన్ తండ్రి సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.