బెంగళూర్ : మేనమామ భార్యను 17 ఏండ్ల బాలుడు ఆమె ఇంట్లోనే కత్తితో పొడిచి చంపిన ఘటన బెంగళూర్లో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వంత మేనల్లుడితోనే(మైనర్) మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. మంగళవారం సాయంత్రం మహిళ ఇంటికి బాలుడు రాగా ఇద్దరం ఎక్కడికైనా పారిపోదామని అతడిని ఒత్తిడి చేసింది. ఆమె ప్రతిపాదనకు బాలుడు నిరాకరించడంతో కత్తెరతో అతడిపై దాడికి యత్నించగా, కత్తెరను లాక్కున్న బాలుడు దానితో ఆమెను కసితీరా పొడిచాడు. ఆపై బెడ్షీట్కు నిప్పంటించిన బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఇంటి నుంచి మంటలు రావడం గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులకు రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉన్న మహిళ కనిపించింది. మహిళ శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తన మైనర్ మేనల్లుడుతో భార్య వివాహేతర సంబంధం తెలిసినప్పటి నుంచి ఆమెతో గొడవపడుతున్నానని భర్త పోలీసులకు వివరించాడు. భార్య ప్రవర్తనతో విసిగిన తాను పిల్లలను వారి తాత ఇంటివద్ద ఉంచానని చెప్పాడు. హత్య జరిగిన సమయంలో మహిళ భర్త ఆఫీసులో ఉన్నాడని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. బాలుడితో తన వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలియడంతో ఇద్దరం ఎటైనా వెళ్లిపోదామని బాలుడిపై మహిళ ఒత్తిడి తీసుకువచ్చిందని చెప్పారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని జువెనైల్ హోంకు తరలించారు.