ముంబై : క్రెడిట్ కార్డు బకాయిలు సెటిల్ చేసేందుకు తన కోరిక తీర్చాలని ఎస్బీఐ థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లు వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఎంఎస్) యజమానులు, ఏజెంట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలి భర్త పేర్కొన్నారు. క్రెడిట్ కార్డు బకాయిల పేరుతో వారు ముందు తమను బెదిరించారని, ఆపై అసభ్యకర పదజాలం వాడుతూ వేధించారని తెలిపారు. ఆపై బకాయిలు సెటిల్ చేసేందుకు తమ లైంగిక వాంఛలు తీర్చాలని వారు నేరుగా తమ భార్యకు ఎస్ఎంఎస్ పంపారని వివరించారు.
బాధిత మహిళ (29) గత మూడేండ్లుగా క్రెడిట్ కార్డు వాడుతూ బిల్లులన్నీ సకాలంలో క్లియర్ చేస్తూ వచ్చారు. అయితే కరోనా లాక్డౌన్ ఇబ్బందులతో ఆర్ధిక సమస్యలు ఎదురైనందున రూ 21,000 మొత్తం బకాయి పడ్డామని చెప్పారు. ఇక మహిళ ఫిర్యాదు మేరకు బ్యాంకు రికవరీ ఏజెంట్లపై కేసు నమోదు చేసి నోటీసులు పంపిన పోలీసులు ఆపై చేతులు దులుపుకున్నారని, ఇంతవరకూ నిందితులను అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఫిర్యాదు చేసిన ఆరు నెలల వరకూ పోలీసులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని బాధిత జంట ఆరోపించింది. జులైలో తిరిగి విచారణను చేపట్టి నిందితులను అరెస్ట్ చేసేందుకు తమను ఢిల్లీ తీసుకువెళ్లి ఖర్చులన్నీ తమతో పెట్టించారని వారు వెల్లడించారు.
ఇంతచేసీ నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్పారు. నిందితులతో కలిసి కేసును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని బాధితురాలి భర్త ఆరోపించారు. మరోవైపు బ్యాంకు ఏజెంట్లు తమ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి తన భార్య ఫోటోను ఉంచి పెయిడ్ సెక్స్కు అందుబాటులో ఉంటుందని రాశారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కొన్ని వారాల పాటు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో తమ పరువు పోయిందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత జంట పోలీసులను డిమాండ్ చేసింది.