నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ తండా శివారులో ఉన్న మల్లారం గండిలో బుధవారం ప్యాసింజర్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికకక్కడే దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎస్హెచ్వో లింబాద్రి, స్థానికులు తెలిపిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. జక్రాన్పల్లి మండలంలోని పడకల్ తండా నివాసి బానోత్ సువర్ణ (30), నిజామాబాద్ నగరంలోని సంతోష్నగర్ నివాసి పవర్ ఉషా (48) ఇద్దరు మల్కాపూర్ తండాలో తమ బంధువుల ఇంటికి వచ్చి దసరా పండగ వేడుకలు జరుపుకున్నారు.
బుధవారం సాయంత్రం ప్యాసింజర్ ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మల్లారం గండిలో మూలమలుపు వద్ద ఎదురుగా లారీ రావడంతో ఆకస్మాత్తుగా బ్రేక్ వేసిన కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో సువర్ణ, ఉషా అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఆటోను అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానలోని మార్చురీ గదికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్హెచ్వో తెలిపారు.