చండీఘఢ్ : బస్టాండ్లో డ్రాప్ చేస్తానని నమ్మబలికి మహిళా ప్రయాణీకురాలిపై (35) లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ ఉదంతం చండీఘఢ్లో ఆదివారం వెలుగుచూసింది. ఈ ఘటనలో నిందితుడు జయదేవ్ అలియాస్ ఉపేందర్ (27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన మహిళ పని నిమిత్తం చండీఘడ్కు వచ్చింది.
తాను కలిసే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో ఆమె తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు చండీఘఢ్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఢిల్లీకి ఆ సమయంలో ఎలాంటి రైళ్లు లేకపోవడంతో బస్సులో వెళ్లేందుకు సిద్ధమైంది. రైల్వే స్టేషన్ వద్ద బస్టాండ్కు వెళ్లేందుకు ఆటో మాట్లాడుకుంది.
అయితే ఆటో డ్రైవర్ ఆమెను బస్టాండ్కు తీసుకువెళ్లకుండా చండీఘఢ్ సివిల్ సెక్రటేరియట్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని కొట్టి రోడ్డుపై విడిచివెళ్లాడు. సాయం కోసం బాధితురాలు అరుపులు విన్న సివిల్ సెక్రటేరియట్ నైట్ గార్డ్ 112 హెల్ప్లైన్కు కాల్ చేశాడు. రంగంలోకి దిగిన చండీఘఢ్ పోలీసులు పార్కింగ్ ఏరియాలో తన ఆటోలో కూర్చున్న నిందితుడిని అరెస్ట్ చేశారు.