గువాహటి : కుమార్తెకు పిల్లలు కలగలేదని.. ఓ తల్లిని చంపి, ఆమె పది నెలల పసికందును కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అసోంలోని చారాయిడియో జిల్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కెందుగురి బాయిలాంగ్ గ్రామానికి చెందిన నీతుమోనికి 10 నెలల పసిబిడ్డ ఉంది. అయితే తన తల్లి ద్వారా ఓ ఇద్దరు దంపతులు.. నీతుమోనిని సీమల్గురి మార్కెట్కు సోమవారం సాయంత్రం పిలిపించారు. ఇక పసికందును ఎత్తుకెళ్లేందుకు దంపతులైన బసంతా గోగోయ్, ప్రణాళి గోగోయ్ యత్నించారు. కానీ వారి ప్రయత్నాన్ని నీతుమోని అడ్డుకుంది. దీంతో నీతుమోనిని చంపి, స్థానికంగా ఉన్న డ్రైనేజీలో పడేశారు.
అయితే మంగళవారం ఉదయం నీతుమోని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ ఆధారాలతో బసంతా దంపతులతో పాటు వారి కుమారుడిని, బాధితురాలి తల్లిని అరెస్టు చేశారు. పది నెలల పసికందును ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు.
తమ బిడ్డకు పిల్లలు పుట్టడం లేదని, అందుకే నీతుమోని బిడ్డను కిడ్నాప్ చేసినట్లు బసంతా దంపతులు పోలీసుల విచారణలో అంగీకరించారు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న తమ కుమార్తెకు బిడ్డను అప్పగించేందుకే కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు.