శేరిలింగంపల్లి : ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఒడిస్సా రాష్ట్రం, మల్కాన్గిరి జిల్లా, లచ్చిపేట్ ప్రాంతానికి చెందిన నిహార్ మండల్ (41), మెంటు మండల్ (48)లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్రాంగూడ హనుమాన్ దేవాలయం సమీపంలో గురువారం రెండు బ్యాగులను చేత పట్టుకొని ఆనుమానాస్పదంగా సంచరిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా 9 కిలోల గంజాయి ప్యాకేట్లు లభించాయి. ఒడిస్సా నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకువచ్చి నానక్రాంగూడలో అధిక ధరకు విక్రయించేందుకు వచ్చినట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.