బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా అక్కవరం గ్రామానికి చెందిన చెల్లేరు త్రిమోద్ (19) అనే యువకుడు సినిమాల్లో సెట్టింగ్స్ హెల్పర్గా పనిచేస్తు కృష్ణానగర్లో నివాసం ఉంటున్నాడు.
గత కొంతకాలంగా చేతిలో పనిలేకపోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న కృష్ణవేణి (43) బుధవారం ఉదయం 6గంటల ప్రాంతంలో డ్యూటీకి వెళ్లేందుకు రోడ్డుమీద నడుచుకుంటూ ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ వెనకాల అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చింది.
ఆమె రాకను గమనించిన త్రిమోద్ నడుచుకుంటూ వచ్చి ఆమె మెడలోంచి బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు త్రిమోద్ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.