కోల్ కతా : వీధి కుక్కలపై రాళ్లు విసురుతున్న వారిని వారించినందుకు జంతు ప్రేమికుడిని ఇద్దరు యువకులు దారుణంగా చితకబాదడంతో బాధితుడు మరణించిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో వెలుగుచూసింది. బాధితుడిని కారు డ్రైవర్ గా పనిచేసే చంద్ర ఆచార్య (56)గా గుర్తించారు. వీధి కుక్కలపై రాళ్లు విసురుతున్న మహ్మద్ ముస్తకిం, మహ్మద్ అరిఫ్ లను గురువారం ఆచార్య వారించగా ఇద్దరు యువకులు ఆయనపై దాడి చేసి ఛాతీపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
యువకుల దాడితో ఆచార్య అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్ధానికులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఆచార్య జంతుప్రేమికుడని, ఆయన తన ఇంటిలో పెంచుతున్న కుక్కలకు బిస్కెట్లు వేస్తుండగా యువకులు ఆయనపై పైశాచికంగా దాడికి తెగబడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారిపై హత్య కేసు నమోదు చేశామని చెప్పారు.