మన్సూరాబాద్ : ఓపెన్నాలాలో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సదరు వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో నాలాలో పడిపోయాడా.. లేక.. ఎవరైనా అతడిని హతమార్చి నాలాలో పడవేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. ఎల్బీనగర్, బైరామల్ గూడలోని అఫెక్స్ దవాఖాన సమీపంలోని ఓపెన్ నాలాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (30) మృతి చెంది పడి ఉండటాన్ని హాస్పిటల్లో పని చేసే అక్రమ్ గుర్తించాడు.
శుక్రవారం మధ్యహ్నం 2 గంటల సమయంలో విషయాన్ని వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు తెలియజేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి ముఖం, తలపై గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మృతుడు మద్యం మత్తులో నాలాలో పడిపోయాడా.. లేక ఎవరైనా అతడిని హతమార్చి నాలాలో పడవేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.