లక్నో : వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. బాలికతో సన్నిహితంగా మెలుగుతున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు చితకబాది హత్య చేసిన ఉదంతం యూపీలోని బదౌన్ జిల్లాలో వెలుగుచూసింది. బాధిత యువకుడు మహ్మద్ సాజిం చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో బబత్ గ్రామంలో అమ్మమ్మ, మేనమామ ఇంట పెరిగాడు.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాలికతో పరిచయం ఇరువురి మధ్య ప్రేమకు దారితీసింది. సాజింను కలిసేందుకు బుధవారం రాత్రి బాలిక అతడి ఇంటికి రాగా, విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సాజిం తలుపు తట్టి అతడిని దారుణంగా హింసించి ఊపిరిఆడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. తన మేనల్లుడిని బుధవారం రాత్రి లేఖ్ రాజ్, జబ్బు, సౌరభ్ లు హత్య చేశారని సాజిం మేనమామ గుడ్డు వెల్లడించారు. నిందితులందరిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.