ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డొంబివలి లైంగిక దాడి కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. తాజా అరెస్టులతో ఈ కేసులో బాధిత బాలిక ఆరోపించిన మొత్తం 33 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టయింది. ఆదివారం సాయంత్రం, సోమవారం ఉదయం థానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్లు జరిగాయి.
15 ఏండ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మొత్తం 33 మంది నిందితులనూ అరెస్ట్ చేశామని, కొత్తగా మరే నిందితుల పేర్లూ చేర్చలేదని సీనియర్ పోలీస్ అధికారి దదహరి చౌరే పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో బాలికతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేసి ఆ చర్యను వీడియో తీయడంతో అరాచక పర్వం మొదలైంది. ఆ వీడియోను నిందితుడు తన ఫ్రెండ్స్కు, పరిచయస్తులకు షేర్ చేయడంతో వారు సైతం బాలికను బెదిరించి వివిధ ప్రాంతాల్లో సెప్టెంబర్ వరకూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 22న బాలిక తన బాగోగులు చూసే ఆంటీకి విషయం తెలపడంతో ఈ ఘోరం వెలుగుచూసింది.