లక్నో: మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్య చేతులు కట్టేసిన భర్త, నలుగురితో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేశాడు. దీంతో ఆమె మరణించింది. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో ఈ దారుణం జరిగింది. ఘజియాబాద్కు చెందిన 30 ఏళ్ల రితికా సింగ్కు ఫిరోజాబాద్కు చెందిన ఆకాష్ గౌతమ్తో 2014లో వివాహం జరిగింది. రితికా తన బ్లాగ్లో ఫ్యాషన్, ట్రావెల్పై సలహాలు ఇచ్చేది. అయితే వారిద్దరూ 2018లో విడిపోయారు. దీంతో ఫేస్బుక్లో పరిచయమైన విపుల్ అగర్వాల్తో కలిసి రితికా సహజీవనం చేస్తున్నది. ఆగ్రాలోని తాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మేవతిలో ఒక అపార్ట్మెంట్లో వారిద్దరూ కలిసి ఉంటున్నారు.
కాగా, రితికా భర్త ఆకాష్కు ఈ విషయం తెలిసింది. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇద్దరు మహిళలు, ఇద్దరు మగవారితో కలిసి అతడు అక్కడకు వెళ్లాడు. రితికా, విపుల్ అగర్వాల్పై దాడి చేశారు. తాళ్లతో వారిద్దరి చేతులు కట్టేశారు. విపుల్ను బాత్రూమ్లో బంధించారు. అనంతరం నాలుగో అంతస్తులో ఉన్న అపార్ట్మెంట్ బాల్కానీ నుంచి రితికాను కిందకు విసిరేశారు. కింద పడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
మరోవైపు బాత్రూమ్లో బంధించిన విపుల్ అగర్వాల్ కిటికీ నుంచి కేకలు వేసి స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. అనంతరం జరిగిన దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. రితికా భర్తతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.