చెన్నై : భర్త నుంచి విడిపోయి మరొకరిని పెండ్లి చేసుకునేందుకు సిద్ధపడిన మహిళ అడ్డుగా ఉన్న తన తొమ్మిది నెలల కూతురిని అమ్మేసిన ఘటన తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో వెలుగుచూసింది. కూతురు ఉంటే పెండ్లి సంబంధాలు రావనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడింది. 2019లో విరుద్నగర్ జిల్లాకు చెందిన ఆర్ మణికందన్తో జబమలర్ (28) వివాహం జరిగింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెండ్లయిన కొద్దినెలలకే వారు విడిపోయారు. దీంతో జబమలర్ తన కూతురితో కలిసి పుట్టింటికి తిరిగివచ్చింది. ఆమెకు తిరిగి పెండ్లి చేయాలని తల్లితండ్రులు యోచిస్తూ కూతురు అడ్డుగా ఉందని ఆమెను వేరొకరికి అమ్మేందుకు నిర్ణయించారు.
సెప్టెంబర్ 23న చిన్నారిని విక్రయించేందుకు జబమలర్ ఆమె తల్లితండ్రులు ఇద్దరు ఏజెంట్లు కార్తికేయన్, జేసుదాసన్లను సంప్రదించారు. సంతానం లేని సెల్వమణి, శ్రీదేవి దంపతులకు చిన్నారిని రూ 3 లక్షలకు విక్రయించారు. తన కూతురిని అమ్మేశారని తెలుసుకున్న జబమలర్ భర్త మణికందన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని రక్షించడంతో పాటు బాలికను కొనుగోలు చేసిన జంటను అరెస్ట్ చేశారు. జబమలర్ సహా ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.