మునిపల్లి, జనవరి 3 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమపెండ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయవిదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది. కొండాపూర్ సీఐ లక్ష్మారెడ్డి వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా కోహీర్కు చెందిన బొగ్గుల అమృత(20), వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన బేగరి శివకుమార్(24) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
అమృత తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అమృత తల్లిదండ్రులు కూతురి ప్రేమను అంగీకరించి, ఉగాది పండుగ అనంతరం పెళ్లి జరిస్తామని హామీ ఇచ్చారు. శివకుమార్ సైతం తన ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు.
తర్వాత ఏమైందో ఏమో గానీ, సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధి బుధేరా-మార్పల్లి ప్రధాన రోడ్డుపై చెట్టుకు ప్రేమికులు ఉరేసుకున్నారు.
స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. కొండాపూర్ సీఐ లక్ష్మారెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ప్రేమికులు రాసిన సూసైడ్ నోట్ లభించింది. తాము కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని, ప్రస్తుతం తాము కలిసి బతకలేమని అర్థం అయ్యాక.. ఎందుకు బతకడం అని అందులో రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అమృత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. శివకుమార్ తల్లిదండ్రులు ఒప్పకోకపోవడంతో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ వివరించారు. అయితే ప్రేమజంట పెండ్లి విషయాన్ని ఇరుకుటుంబాలు అంగీకరించపోవడంతోనే ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు.