నిజామాబాద్ : జిల్లా కలెక్టరేట్లో ప్రజా వాణి సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించడం కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు..బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లికి చెందిన దర్శనం బంధయ్య, దర్శనం వాణి ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.
౩౦ ఏళ్ల క్రితం నుంచి సాగుచేసుకుంటున్న రెండు ఎకరాల భూమిని ధరణిలో ఇతరుల పేరిట పాస్ బుక్ జారీ అయ్యిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమ గ్రామ మాజీ సర్పంచ్ తమపై దాడులకు ప్రయత్నిస్తున్నట్లుగా బాధితులు చెప్పారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే దాడులపై పోలీస్ అధికారులకు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు భూమిని విక్రయించిన వారితో రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.