మెహిదీపట్నం : నేర సామ్రాజ్యంలో పేరు సంపాదించి అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ట్రావెల్ ఏజెంట్ను కత్తులతో దారుణంగా హత్య చేశారు ఆరుగురు యువకులు. వారిలో ప్రధాన నిందితుడు తప్ప అందరూ గంజాయి సేవించే వారే కావడం గమనార్హం. అంతే కాకుండా హత్య సమయంలో ప్రధాన నిందితుడు తప్ప అందరూ గంజాయి మత్తులోనే ఉన్నట్లు తెలిసింది.
గత శనివారం (ఆగస్టు 7 )రాత్రి హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎన్ఎండీసీ సమీపంలోని ఓ కాంప్లెక్స్లో ట్రావెల్ పాయింట్ యజమాని ఖాజీ నజీముద్దీన్ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసు మిస్టరీని హుమాయూన్నగర్ పోలీసులు ఎట్టకేలకు వారం రోజుల తర్వాత ఛేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాసాబ్ట్యాంక్ అహ్మద్ నగర్ ఫస్ట్లాన్సర్లో నివసించే సమీర్(25),ఇమ్రాన్, సాదిక్, ఫీక్, మతిన్, ఇర్ఫాన్లు స్నేహితులు. వీరిలో సమీర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.
సమీర్ తప్ప మిగతా వారందరూ తరచూ గంజాయి సేవిస్తుంటారు. ఇదిలా ఉండగా నేర సామ్రాజ్యంలో పేరు సంపాదించి అక్రమ వసూళ్లతో డబ్బులు సంపాదించాలని సమీర్ పథకం పన్నాడు. ఈ మేరకు స్నేహితులకు హత్య పథకాన్ని వివరించి ఈ నెల 7 వ తేదీన ఎన్ఎండీసీ సమీపంలోని ట్రావెల్ పాయింట్ యజమాని ఖాజీ నజీముద్దీన్ను దారుణంగా హత్య చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం వీరందరినీ హుమాయూన్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.