మొయినాబాద్ : ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్ రాష్ట్రంకు చెందిన రుస్తయిన్(40) బతుకు దెరువు కోసం మొయినాబాద్ మండలానికి కొంతకాలం క్రితం వచ్చాడు. మొయినాబాద్లోనే నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మండల పరిధిలోని ఐఐటీఏ సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతని ఆధార్కార్డులో ఉన్న వివరాల ఆధారంగా అడ్రస్ తెలుసుకున్నారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.